రాహుల్‌ గాంధీపై సంచలన ఆరోపణలు

6 Jul, 2018 09:42 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్‌ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌కి డ్రగ్స్‌ అలవాటు ఉందని, డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి పేర్కొన్నారు. తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సాక్షి, న్యూఢిల్లీ: ‘పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుగా కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలి. ఆయన ఖచ్ఛితంగా విఫలం అవుతారు. ఎందుకంటే ఆయన కోకైన్‌ తీసుకుంటారు కాబట్టి’ అని ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ స్వామి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కూడా స్పందిస్తూ.. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌ అడిక్ట్స్‌ ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 70 శాతం యువత డ్రగ్స్‌ మత్తులో ఊగుతోందని రాహుల్‌ అంటున్నారు. కానీ, వారి పార్టీలోనే ఉన్న డ్రగ్‌ అడిక్ట్స్‌కు ముందుగా డోప్‌ టెస్టులు నిర్వహించండి. అది రాహుల్‌తోనే మొదలుపెడితే బాగుంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.   (సంచలన నిర్ణయం)

ప్రభుత్వ ఉద్యోగులకు(పోలీస్‌ శాఖతోసహా) డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలని, నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ సర్కార్‌ నిర్ణయించింది. అంతేకాదు నిషేధిత డ్రగ్స్‌ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్‌, సీఎం అమరీందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్‌ టెస్ట్‌లు చేయిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సీఎంతోసహా ప్రజా ప్రతినిధులందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు