సమోసాలు తింటూ రాహుల్‌ గాంధీ..

19 Aug, 2019 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల తీవ్ర వరదలకు గురైన కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో ఏరియల్‌ సర్వేకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ విమానంలో తీరిగ్గా సమోసాలు తింటున్న దశ్యం అంటూ బీజేపీ మద్దతుదారుదు మధు పూర్ణిమ కీశ్వర్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘వరద ప్రాంతాల్లో వాయనాడ్‌ ఎంపీ ఏరియల్‌ సర్వేను చూడండి ఎంత హాస్యంగా ఉందో’ అంటూ వీడియోకి ఓ వ్యాఖ్యానాన్ని కూడా జోడించారు. కేరళలో ఇటీవల సంభవించిన వరదల్లో 104 మంది మరణించగా, వారిలో 12 మంది వాయనాడ్‌ ప్రాంతంలోనే మరణించారు. ఏడుగురు గల్లంతయ్యారు. వాయనాడ్‌లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల కొండ చెరియలు ఎక్కువగా విరిగి పడ్డాయి.

కొన్ని గంటల తర్వాత మధు పూర్ణిమ కీశ్వర్‌ తన పోస్టింగ్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ ఈ వీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్‌ న్యూస్‌’ ప్రయత్నించగా పాత వీడియో అని తేలింది. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ, వాయనాడ్‌కు వెళ్లినప్పటి వీడియో అది. దాని ఆ రోజున పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ‘వాయనాడ్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్‌ గాంధీ సమోసాలు తింటూ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి!’ అనే వ్యాఖ్యానంతో ఏబీపీ న్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. 

మరిన్ని వార్తలు