మోదీ.. నోరువిప్పండి: రాహుల్‌

14 Apr, 2018 03:43 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసాకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం సరికాదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నోరు విప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మోదీకి ప్రశ్నలు సంధించారు. ‘మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసాకాండ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అత్యాచారాలు, హత్యల్లో నిందితులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది? మీ స్పందన కోసం భారతదేశం ఎదురు చూస్తోంది.

మాట్లాడండి..’ అని రాహుల్‌ గాంధీ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కథువా, ఉన్నావ్‌ అత్యాచారాల కేసుల నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో గురువారం అర్ధరాత్రి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వేలాది కార్యకర్తలతో పాటు రాహుల్, సోనియా, ప్రియాంక వాద్రా, పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. కాగా కథువా, ఉన్నావ్‌ అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు