ఆల్వార్‌ బాధితురాలిని పరామర్శించిన రాహుల్‌

16 May, 2019 13:57 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ  ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దుర్ఘటనపై నాకు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో మాట్లాడాను. ఈ విషయంలో నేను ఎలాంటి రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదు. బాధితురాలికి తప్పక న్యాయం చేస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. అయితే ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ దుర్ఘటనను తొక్కిపెట్టింది. బాధితురాలు దళిత మహిళ కావడంతో జరిగిందేదో  జరిగిపోయింది అంటోంది’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు  గుప్పించారు. ఈ ఘటనపై మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరిస్తారా అని మోదీ.. మాయావతిని ప్రశ్నించారు.

గత నెల 26న ఆల్వార్‌లో బైక్‌పై వెళ్తున్న జంటను ఓ ఐదుగురు వ్యక్తులు అడ్డగించి.. భర్తను గాయపరచి.. భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు దళిత మహిళ కావడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది.

మరిన్ని వార్తలు