కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాహుల్‌ డుమ్మా

13 Sep, 2019 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ డుమ్మా కొట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌  పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం ఈ భేటీ జరిగింది. దేశ ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, వందరోజుల పాలన, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ ఎంపీలు, అన్ని రాష్ట్రాల పీసీసీలు దీనికి హాజరయ్యారు. కానీ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ గైర్హాజరు కావడం పలువురి నేతల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దేని కారణంగా రాహుల్‌ హాజరుకాలేదని నేతలు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాహుల్‌ రాజీనామా అనంతరం.. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని నేతల సమాచారం. కాగా గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో పార్టీ నేతకు సోనియా దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేసిన సోనియా.. నేతలంతా ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా పోస్టులకు ముగింపు పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని ఆమె సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్‌ వల్లబాయ్‌పటేల్‌, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని వాటిన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు