రాహుల్‌కు గుజరాత్‌ కోర్టు సమన్లు

9 Apr, 2019 04:22 IST|Sakshi

పరువునష్టం కేసులో మే 27న హాజరు కావాలని ఆదేశం

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలాకు గుజరాత్‌లోని ఓ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2016 నవంబర్‌లో అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీబీ) రూ.750 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్చి భారీ కుంభకోణానికి పాల్పడిందని వీరు తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ బ్యాంకు చైర్మన్‌ అజయ్‌పటేల్‌ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మే 27వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ వారిద్దరికీ సోమవారం సమన్లు జారీ చేశారు.

ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన బీజేపీ చీఫ్‌ అమిత్‌షాకు చెందిన రూ.745 కోట్ల మేర పాత నోట్లను కొత్తవాటితో మార్పిడి చేసిందని ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త తెలిపిన సమాచారం మేరకు రాహుల్‌ గాంధీ.. ‘కేవలం ఐదు రోజుల్లోనే రూ.750 కోట్ల పాతనోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసి, ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు కంగ్రాట్స్‌ అమిత్‌ షా జీ, డైరెక్టర్, అహ్మదాబాద్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌..’అంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు