కేంద్రం నిర్ణయంపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం

25 Jan, 2020 17:23 IST|Sakshi

న్యూఢీల్లీ: బీజేపీ అసమర్థ పాలనను, ద్వేషపూరిత ఎజెండాను విమర్శించినవారిపై అర్బన్‌ నక్సలైట్‌ అనే ముద్రవేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా ఆయన బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. భీమా- కోరెగావ్‌ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసందే. ప్రతిఘటనకు చిహ్నమైన భీమా- కోరెగావ్‌ యుద్ధ స్మారకం ప్రాముఖ్యాన్ని కేంద్రానికి తొత్తుగా పనిచేసే ఎన్‌ఐఏ తగ్గించలేదని ట్విటర్‌లో పేర్కొన్నారు.
(చదవండి : పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’)

ఈ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం పుణె సీనియర్‌ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శివసేన ప్రభుత్వం భీమా- కోరెగావ్‌ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్తలు, మేధావులపై కేసును ఉపసంహరించుకుంటున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్‌ స్పందించారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

మరిన్ని వార్తలు