ప్రధాని మోదీపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రం!

24 Jun, 2020 18:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం మహమ్మారి కరోనాకు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలకు కూడా అన్‌లాక్‌ సడలింపులు ఇచ్చారేమోనని ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రం సంధించారు. అన్‌లాక్‌తో కరోనా కేసుల్లో పెరుగుదలే కాదు.. ఇంధన ధరలు కూడా భగ్గుమంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఇంధన ధరలు, కరోనా కేసుల పెరుగుదలను సూచించే ఓ గ్రాఫ్‌ను ఆయన షేర్‌ చేశారు. ఇక చైనా ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడం, ప్రధాని మోదీ దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న వ్యాఖ్యలపై కూడా రాహుల్‌ కేంద్రంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
(చదవండి: లీటర్ ఆయిల్ పై 70 శాతం పన్నులు)

కాగా, దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 4.56 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఇవాళ ఒక్కరోజే 16 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 450 మరణాలు సంభవించాయి. దాంతోపాటు గత 18 రోజులుగా దేశవ్యాప్తంగా డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరాభారంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 79.88 రూపాయలకు, డీజిల్‌ 79.40 రుపాయలకు లభ్యమవుతోంది. మొత్తంమీద లీటర్‌ పెట్రోల్‌పై 9.41రూపాయలు, డీజిల్‌పై 9.58 రూపాయలు మేర ధరలు అధికమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తీరు ఉంది.
(కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ)

మరిన్ని వార్తలు