న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్లో నెలకొన్న సంక్షోభం కొనసాగుతుండగా అక్కడి రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు బీజేపీ విపరీతంగా ధనం కుమ్మరిస్తోందని రాహుల్ ఆరోపించారు. విపక్ష సర్కార్లను అస్ధిర పరిచేందుకు డబ్బు సంచులతో బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని, ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే తంతు కొనసాగించడం మనం చూశామని వ్యాఖ్యానించారు.
మరోవైపు కర్ణాటకలో పాలక సంకీర్ణ సర్కార్ బలపరీక్షకు సిద్ధంగా ఉందని, అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తేదీ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ను కోరారు. ఇక 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం వరకూ యథాతథ స్ధితి కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో కన్నడ రాజకీయాల్లో సందిగ్ధత కొనసాగుతోంది.