హైదరాబాద్: రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకను అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రోజు సమావేశంలో డీసీసీలకు తగు సూచనలు చేశామని వెల్లడించారు.
లోకల్బాడీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు విప్ జారీ చేసేందుకు డీసీసీలకు అధికారం ఇచ్చామని పేర్కొన్నారు. గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కాపాడుకునేందుకు తగు సూచనలు డీసీసీలకు ఇచ్చామన్నారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల కోసం పీసీసీ నుంచి ప్రత్యేకంగా పరిశీలకులను పీసీసీ నియమించిందని మల్లు రవి తెలిపారు. ఈ ఎన్నికల బాధ్యతను పూర్తిగా డీసీసీలకు అప్పగించామని వ్యాక్యానించారు.