‘ఇది అసంబద్ధం.. వారంతా భారతీయులు’

26 May, 2020 18:10 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్మికుల వలసలపై ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. ‘యోగి వ్యాఖ్యలు అసంబద్ధమైనవి’అని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కార్మికులను తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని సీఎం యోగి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన తమ రాష్ట్ర పౌరులు.. అక్కడ ఇబ్బందులు పడుతున్నారని యోగి ఆదివారం జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. వారికి సామాజిక భద్రత, బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. 
(చదవండి: ‘లాక్‌డౌన్‌పై కాంగ్రెస్‌ అప్పుడలా.. ఇప్పుడిలా’)

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘ఉత్తర్‌ప్రదేశ్‌ పౌరులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోకుండా యోగి నియంత్రించడం సరికాదు. వారంతా తొలుత భారతీయులు. తర్వాతే ఒక రాష్ట్రానికి చెందిన వారు. వలస వెళ్లే వారంతా యోగి ఆదిత్యనాథ్‌ సొత్తు కాదు’అని అన్నారు. సీఎం యోగి వ్యాఖ్యలు దురదృష్టకరని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌ పౌరులను భారతీయులతో వేరు చేసేట్టుగా ఉన్నాయని విమర్శించారు. ‘ఇతర ప్రాంతాలకు వెళ్లి నచ్చిన పని చేసే హక్కును యోగి కాలా రాస్తున్నారు. తమ కలలు నెరవేరేలా.. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక వంటి ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునే హక్కు వారికి ఉండకూడదా?’అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.
(చదవండి: లాక్‌డౌన్‌ విఫలం: ప్లాన్‌ బి ఏంటి..!)

మరిన్ని వార్తలు