రయ్‌.. రయ్‌.. రాహుల్‌ 

14 Aug, 2018 05:06 IST|Sakshi

     తొలిరోజు బిజీబిజీగా అధ్యక్షుడి పర్యటన 

     నేడు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో ప్రత్యేక భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉదయం 11:30కి శంషాబాద్‌కు వచ్చిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లి అక్కడ జరిగిన ఓ సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ శంషాబాద్‌కు వచ్చారు. అక్కడ్నుంచి క్లాసిక్‌ కన్వెన్షన్‌లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో శేరిలింగంపల్లికి చేరుకుని బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం 7:30 సమయంలో శేరిలింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి రాత్రి బస చేసే హరిత ప్లాజాకు వెళ్లారు. అక్కడ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ నేత కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో భేటీ అయి తొలిరోజు పర్యటనను సమీక్షించారు. తొలి రోజు జరిగిన రెండు సభలకూ మంచి స్పందన కనిపించడం, పెద్దఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు కనిపించడంతో టీపీసీసీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. 

సంపత్‌.. ఇటు రా.. 
మహిళా సంఘాలతో సమావేశం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, ఆలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ హల్‌చల్‌ చేశారు. రాహుల్‌ వేదికపైకి వచ్చినప్పట్నుంచీ సభ నిర్వహణ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. సంపత్‌ను ప్రత్యేకంగా పిలిచిన రాహుల్‌ ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ‘సంపత్‌.. ఇటు రా’ అని పిలిచి ఆ సమయంలో ఉత్తమ్‌ తెలుగులో ఏం మాట్లాడుతున్నారంటూ ఆరా తీశారు. ఆ సమ యంలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, సీఎల్పీ నేత జానారెడ్డిలు కలుగజేసుకుని రాహుల్‌కు రాష్ట్రంలోని పరిస్థితిని వివరించే యత్నం చేశారు. 

నేటి షెడ్యూల్‌ ఇదీ.. 
రెండో రోజు రాహుల్‌ షెడ్యూల్‌లో కొంత మార్పు జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు పార్టీ కేడర్, నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాహుల్‌ భేటీ కానున్నారు. సోమ వారం ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకుని వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారమిచ్చారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు, రాష్ట్రంలో పార్టీ పనితీరు, ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చిస్తారని సమాచారం. అనంతరం పార్టీ కేడర్‌తో టెలీకాన్ఫరెన్స్, ఎడిటర్లు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, గన్‌పార్కు వద్ద తెలం గాణ అమరవీరులకు నివాళులు, సరూర్‌నగర్‌ స్టేడి యంలో ‘విద్యార్థి నిరుద్యోగ గర్జన’లో పాల్గొని సాయంత్రం 7:30కి రాహుల్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు