సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. ప్రధాని మోదీ దొంగల కమాండర్ అంటూ సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. భారత్ సూచించిన మీదటే రిలయన్స్ను భాగస్వామిగా అంగీకరించినట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హూలాండ్ను ఇంటర్వ్యూ చేసిన ఫ్రెంచ్ న్యూస్ వెబ్సైట్ వీడియో క్లిప్ను ట్వీట్తో పాటు రాహుల్ పోస్ట్ చేశారు.
హోలాండ్ వ్యాఖ్యలతో రాహుల్ రాఫెల్ డీల్కు సంబంధించి మోదీ లక్ష్యంగా దాడిని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో వాస్తవాలు వెలుగుచూడాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్ధి కాకూడదని శర్మ పేర్కొన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఆర్థిక, రక్షణ, న్యాయశాఖ మంత్రులు పోటీపడుతున్నారని ఆక్షేపించారు.