‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’

17 Mar, 2020 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ వల్గర్‌ భాషలో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. 5 ఏళ్లలో కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేసారని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాకుండా.. అప్పుల తెలంగాణగా మారిందన్నారు. బైంసాలో జరిగిన హింస గుర్తులేని కేసీఆర్‌కు.. ఢిల్లీ ఘటనలు ఎలా గుర్తున్నాయని ప్రశ్నించారు. 

80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌.. 10 పేజీల సీఏఏ బిల్లు చదవలేదా అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది లేదని అన్నారు. ఎన్నార్సీపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని.. దానిని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్‌ అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదని అన్నారు.

మరిన్ని వార్తలు