రాజయ్య పద్ధతి మార్చుకోవాలి : కడియం

11 Oct, 2018 15:29 IST|Sakshi
కడియం శ్రీహరి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ : స్టేషన్ ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజయ్య! పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ బలపడాలన్నా, కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.

ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. జరగాల్సింది చూడాలి. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు తిరుగులేదు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది, నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలి. రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల’ని అన్నారు.

మరిన్ని వార్తలు