ఎన్నికల బరిలో ‘చౌకీదార్‌’

18 Apr, 2019 05:01 IST|Sakshi
జై కవార్‌ త్యాగి

నిజమేనండీ.. గుర్‌గావ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈ చౌకీదార్‌ పోటీ చేస్తున్నారు. అదేంటీ.. ఈ దేశపు చౌకీదార్‌ మోదీ వారణాసి నుంచి కదా పోటీ చేస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ చౌకీదార్‌ మీరనుకుంటున్న చౌకీదార్‌ కాదు. ఈయన ఢిల్లీలోని గాంధీ సమాధి (రాజ్‌ఘాట్‌)ని కాపలా కాసే చౌకీదార్‌. ఈయన పేరు జై కవార్‌ త్యాగి. వయసు 64 ఏళ్లు. సైన్యంలో పని చేసిన త్యాగి 19 ఏళ్ల నుంచి రాజ్‌ఘాట్‌లో కాపలాదారుగా ఉంటున్నారు. ‘గాంధీజీ సమాధి దగ్గర పని చేస్తుండగా.. ఈ దేశానికి, సమాజానికి ఏదైనా చేయాలన్న ప్రేరణ కలిగింది. వ్యవస్థను బాగు చేయాలంటే దాంట్లో దిగాలన్న జ్ఞానోదయం కలిగింది.

నా సర్వీసులో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎన్నో ప్రభుత్వాలను చూశాను. పేరు తేడా కాని తీరు అందరిదీ ఒక్కటే. దేశం ఎదుర్కొంటున్న అన్ని అనర్థాలకీ మూలం అవినీతి, ఆశ్రిత పక్షపాతమే. నిరుద్యోగం, అవినీతి యువతను, సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో కళ్లారా చూస్తున్నాను. వీటిని అరికట్టడం కోసమే నేను ఎన్నికల్లో దిగుతున్నాను’ అంటూ తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు త్యాగీ. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, సర్కారు ఉద్యోగాలను తగ్గించేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన దక్ష పార్టీ తరఫున త్యాగీ నామినేషన్‌ దాఖలు చేశారు. దాన్ని ఎన్నికల అధికారులు ఆమోదించారు కూడా. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఐదేళ్ల నుంచి తన పింఛను సొమ్మును దాచుకుంటున్నానని త్యాగి చెప్పారు.

మరిన్ని వార్తలు