నేడు రాజకీయాల్లో టికెట్లివ్వబోతున్న రజనీకాంత్‌

12 Mar, 2019 17:23 IST|Sakshi

సాక్షి, వెబ్ ప్రత్యేకం : పైన దేవుడు శాసిస్తాడు.. కింద రజనీకాంత్‌ పాటిస్తాడు.. అని చెప్పే తలైవాకు ఇన్నేళ్లకు దేవుడి శాసించాడు. గత రెండు దశాబ్దాలుగా తన రాజకీయ ప్రస్థానంపై ఊగిసాలాటాడిన రజనీ.. ఎట్టకేలకు పార్టీ పెట్టబోతోన్నట్లు ప్రకటించారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే తన పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన రజనీ వ్యూహం​ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. చకచకా సినిమాలు చేస్తోన్న రజనీ.. రాజకీయాల్లో మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. మరి రజనీ రాజకీయాల్లో పెను​ విప్లవం తీసుకోస్తాడని భావిస్తోన్న అభిమానులు ఆశ నెరవేరుతుందా? ఆ దిశగా తలైవా దూసుకుపోతారా లేదా చూడాలి.

కండక్టర్‌గా లైఫ్‌ సాగుతోన్న వేళ.. తన మిత్రుడు రాజ్‌ బహదుర్‌ ఇచ్చిన సలహా.. తనను ఇంతటి వాడ్ని చేసిందని ఎన్నో వేదికలపై చెప్పారు తలైవా. అందుకే ఇప్పటికీ ఆ మిత్రుడి సలహా తీసుకుంటారు రజనీ. కర్ణాటకను వదిలి చెన్నైలో అడుగుపెట్టిన ఓ సాధారణ వ్యక్తి.. అసాధరణ శక్తిగా ఎదిగి తమిళ దైవంగా ఆరాధించే స్థాయికి చేరుకున్నారు. ఆయన ఒక్కసారి చెబితే.. జయలలిత పీఠం కదిలిందంటేనే ఆయన పవరేంటో అర్థమవుతుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. రజనీ కూడా ఆమె ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. అయితే ఓనాడు సీఎం బయలుదేరుతోందని ఆమె సెక్యురిటీ రజనీని రోడ్డుపై ఎదురు చూసేలా చేశారట. అయితే రజనీ పక్కకు వచ్చి కార్లోంచి దిగి  సిగరెట్‌ తాగుతూ ఉండగా.. రజనీని చూసిన అభిమానులు అక్కడికి తండోప తండాలుగా వచ్చారట. ఇక ముఖ్యమంత్రి పోవడానికి దారిలేక పోయేసరికి సిబ్బంది వచ్చి రజనీని వెళ్లాల్సిందిగా ప్రార్థించారట. అప్పటి నుంచి రజనీ-జయలలిత మధ్య వైరం మొదలైందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

1996 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ సినీ కార్యక్రమంలో  ప్రసంగిస్తూ, రాష్ట్రంలో అసహన ధోరణలు నెలకొన్నాయని ప్రకటించడం ద్వారా రజనీ అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జయలలితకు కోపం తెప్పించారు. 1996 ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే-తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపు ఇస్తూ, ‘‘జయలలితకు మళ్లీ అధికారం అప్పగిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు,’’ అని రజనీకాంత్ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

జయలలిత మరణం.. అటుపై చోటుచేసుకున్న పరిణామాలు.. రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితిని తొలగించడానికి రజనీ సిద్దమైనట్లు తన రాజకీయ ప్రవేశాన్ని నిర్దారించారు. వచ్చే లోక్‌సభలో కాకుండా.. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరాఠి మూలాలున్న శివాజీ రావ్‌ గైక్వాడ్‌ (రజనీకాంత్‌).. 1950 డిసెంబర్‌ 12న కర్ణాటకలో పుట్టి, పెరిగిన రజనీ కాంత్‌.. తమిళనాడులో సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగారు. లతా రంగాచారిని రజనీ వివాహామాడగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు (సౌందర్యా రజనీకాంత్‌, ఐశ్వర్యా ధనుష్‌) ఉన్నారు. రజనీకాంత్‌ నిత్యం హిమాలయాలకు వెళ్తారు. అక్కడ ప్రశాంతంగా గడపడమంటే తలైవా ఇష్టమని చెబుతూ ఉంటారు.
బండ కళ్యాణ్‌

మరిన్ని వార్తలు