ఓట్ల కోసమే రాహుల్‌ టెంపుల్‌ రన్‌: రాజ్‌నాథ్‌

21 Nov, 2018 09:40 IST|Sakshi

భోపాల్‌ : దేవాలయాల్లో కూర్చోరానివాళ్లు కూడా ఎన్నికల కోసం గుళ్ల చుట్టు తిరుగుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం బుర్హాన్‌పుర్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుల, మతాల సెంటిమెంట్స్‌తో ఓట్లు పొందాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అందుకే కనీసం గుడిలో కూర్చోవడం కూడా తెలియని రాహుల్‌ గాంధీ దేవాలయాలు సందర్శించడం మెదలుపెట్టాడన్నారు. అంతకు ముందు ఎప్పుడు అతను దేవాలయాలు సందర్శించలేదని, ఎన్నికల కోసం టెంపుల్‌ రన్‌ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

బీజేపీ ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ అని ప్రకటించిందని, కాంగ్రెస్‌ మాత్రం తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా నాన్చుతుందని విమర్శించారు. ఈ వ్యవహారం చూస్తే ‘పెళ్లి జరుగుతందంట కానీ పెళ్లి కూతురు ఎవరికి తెలియదంటా’ అ‍న్నట్లు కాంగ్రెస్‌ తీరుందని ఎద్దేవా చేశారు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షో గేమ్‌లా రాష్ట్రంలో కాంగ్రెస్‌ కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి గేమ్‌ ఆడుతుందన్నారు. గత పదిహేనేళ్లుగా శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 

  

మరిన్ని వార్తలు