రాజ్‌నాథ్‌సింగ్‌ తొలి పర్యటన ఖరారు!

2 Jun, 2019 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్‌ తొలి పర్యటన ఖరారైంది. ఆయన రేపు సియాచిన్‌ గ్లేసియర్‌ని సందర్శించి భద్రతా పరిస్థితులను సమీక్షిస్తారు. అక్కడున్న సైనికాధికారులు, జవాన్లతో చర్చించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా రాజ్‌నాథ్‌తో కలిసి సియాచిన్‌కి వెళ్లనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా సియాచిన్‌ గ్లెసియర్‌కు పేరుంది. 12వేల అడుగుల నుంచి 23వేల అడుగుల ఎత్తులో భారత్‌ బేస్‌క్యాంప్స్‌ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి తమ సైనికులు రక్షణ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్రమోదీ కూడా సియాచిన్ గ్లేసియర్‌ని సందర్శించారు.

జాతీయ పోలీస్‌ స్మారకాన్ని సందర్శించిన అమిత్‌ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ పోలీస్‌ స్మారకాన్ని సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత జాతీయ పోలీస్‌ మెమోరియల్‌ మ్యూజియంను షా  సందర్శించారు. హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌తోపాటు పోలీస్‌శాఖ ఉన్నతోద్యోగులు ఆయనతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌ షా శనివారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు