-

‘పసుపు కుంకుమ తీసుకొని కారం పూసారు’

23 May, 2019 11:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణ ఓటమిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుసగా సెటైరిక్‌ ట్వీట్లతో దండయాత్ర మొదలు పెట్టారు. పసుపు-కుంకుమ తీసుకున్న ఏపీ మహిళలు..చంద్రబాబుకు ఉప్పు కారం పూసారని ఘాటుగా కామెంట్‌ చేశారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్‌ మీమ్‌ ట్వీట్‌ చేసిన వర్మ.. టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకువస్తుందన్నారు.

అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వర్మ అభినందనలు తెలిపారు. బయోపిక్‌ల ఫలితమే ఎన్నికల ఫలితాల్లో పునరావృతమైందని, యాత్ర, ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాలను ప్రస్తావించారు. జనసేన కన్నా ప్రజారాజ్యమే మేలని పవన్‌ కల్యాణ్‌ ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 142 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు