చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందం అయిపోయారు: వర్మ

21 Jun, 2019 12:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కరావు వెన్నుపోటు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో ట్వీట్‌ చేస్తూ.. ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం వైఎస్‌ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారు’  అని ఎద్దేవా చేశారు.

కాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. ఈ విషయం గురించే రాంగోపాల్‌ వర్మ పై విధంగా ట్విట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు