‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్‌సీపీ’

21 May, 2019 12:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో రెండు రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజున వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీకి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మాట మార్చిన చంద్రబాబు: కాటసాని
చంద్రబాబు ఓటమి భయంతో దేశంలో వివిధ నాయకులను కలిసేందుకు వెళ్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నరేంద్ర మోదీని పొడిగిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి ఆయనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ బాబు జాగ్రత్తగా చూసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ సర్వేలను ప్రకటిస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీకి సేవలందించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు