వైఎస్ జగన్కు గోడు వెళ్లబోసుకున్న దివ్యాంగురాలు
ఆదుకుంటామని జననేత హామీ
సాక్షి, ఎద్దన్నవారి పల్లి (చిత్తూరు) : మహిళలపై ఆంధప్రదేశ్ ప్రభుత్వ దమనకాండ తెలియనిది కాదు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దన్నవారి పల్లి వద్ద రమణమ్మ(45) అనే దివ్యాంగురాలు కలిశారు. దివ్యాంగులకు అందే పెన్షన్ కింద తనకు నెలకు రూ.1500 రావాలని చెప్పారు. అయితే, తనకు కేవలం రూ. 1000 మాత్రమే ప్రతి నెలా అందుతోందని వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేంటని తెలుగుదేశం పార్టీ నేతలను అడిగితే.. బెదిరిస్తున్నారని చెప్పారు. రమణమ్మతో మాట్లాడిన వైఎస్ జగన్ ఆమెను ఓదార్చారు. రమణమ్మకు జరిగిన అన్యాయం పట్ల పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘వైఎస్ఆర్ చేయూత’ పథకం కింద వెనుకబడిన వర్గాలకు చెంది 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్ అందజేస్తామని చెప్పారు.