టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువనేత!

20 Jun, 2019 09:21 IST|Sakshi
కింజరపు రామ్మోహన్నాయుడు (ఫేస్‌బుక్‌ ఫొటో)

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడిని నియమించనున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ అన్నీ తామై వ్యవహరించడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్‌నాయుడిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్‌నాయుడు 6,653 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌ రమణ కొనసాగుతున్నారు. 

మరిన్ని వార్తలు