దామోదర్‌రెడ్డి విజయ చండీయాగం

30 Oct, 2018 02:51 IST|Sakshi
చండీయాగం నిర్వహిస్తున్న దామోదర్‌రెడ్డి

     సీఎం కావాలని యాగం చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ 

     ఆ ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విజయ చండీయాగం ప్రారంభించారు. మంగళవారంతో ఈ యాగం ముగియనుంది. అయితే దామోదర్‌రెడ్డి తాను సీఎం కావాలని ఈ యాగం చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం రాష్ట్ర వ్యాప్తంగా హల్‌చల్‌ చేసింది. విజయ చండీ యాగం వల్ల తనకు శాసనసభ్యుడిగా విజయం కలగాలని, రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా లేదా సీఎంగా పదవీ యోగం కలగాలని కాంక్షిస్తున్నట్టు ఆయన పేరిట సూర్యాపేట, హైదరాబాద్‌లో ఉన్న నివాస గృహాల అడ్రస్‌తో ఉన్న పత్రిక సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

అయితే సోమవారం ఆయన దీనిని ఖండించారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాను యాగం చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. తనపై గిట్టని వాళ్లే ఇలా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల ఈ యాగానికి సూర్యాపేటలోని ప్రముఖులను, పలు పార్టీల నేతలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. యాగం విషయంలో ఎలాంటి అపోహలు సృష్టించవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, టీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు.

మరిన్ని వార్తలు