సినీ నటి రమ్యశ్రీ
అరకులోయ: తప్పుడు హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని సినీ నటి రమ్యశ్రీ పిలుపునిచ్చారు. గురువారం అరకు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆశయసాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరానన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు.
మాట్లాడుతున్న సినీనటి రమ్యశ్రీ
పాదయాత్రలో ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని నవరత్నాలు ప్రకటించారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలూ పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని కోరారు. టీడీపీ పాలనలో గిరిజన ప్రాంతాలు అన్నిరంగాల్లో వెనుకుబాటుకు గురయ్యాయని విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమన్నారు. అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ పాల్గొన్నారు.