అమరావతి: తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కిలారు రోశయ్య, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవితో పాటు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. రాజధానిలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకోవాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని ఆరోపించారు. రైతులు దగ్గర నుంచి మూడు పంటలు పండే భూమిని లాక్కున్నారని ధ్వజమెత్తారు.
రాజన్నరాజ్యం జగన్తోనే సాధ్యం: లేళ్ల
రాష్ట్రంలో రాజన్న రాజ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి దోచుకోవడం దాచుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రాజన్న పేరుతో ఉచిత వైద్యం: శ్రీదేవి
ప్రజలకు సేవ చేయడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, రాజధానిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. రాజన్న వైద్యం పేరుతో రాజధానిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మందులు కూడా పంపిణీ చేయాలనుకుంటున్నామని తెలిపారు. వైఎస్ జగన్తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నవ రత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని వ్యాక్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు.