పేదల గుండెచప్పుడు

13 Mar, 2019 08:16 IST|Sakshi

(యంబ నర్సింలు, యాదాద్రి) :దేశ స్వాతంత్య్రం కోసం, నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాడిన ఎందరో యోధుల్లో ప్రథములు రావి నారాయణరెడ్డి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి విముక్తి కోసం, బడుగు బతుకులను చైతన్య ఉద్యమంలోకి తెచ్చిన గొప్ప నాయకుడాయన. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజా ర్టీతో ఎంపీగా విజయం సాధించిన ప్రజాభిమాని. సాదాసీదా జీవితాన్ని గడుపుతూ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వారి జీవితాల్లో వెలుగు నింపడానికి రాజీలేని పోరాటం నడిపారు. ఉమ్మడి నల్ల గొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్‌ 4న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో తెలంగాణ ప్రతినిధిగా హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి పాల్గొన్నా రు. హరిజనుల కోసం పాఠశాలలను స్థాపించి వారి ఉద్దరణ కోసం సామాజిక న్యాయ పోరాటం సాగిం చారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరు, 1944 లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. భువనగిరి మహాసభలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నికై కమ్యూనిస్టు అగ్రనేతలు బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూం మొయినొద్దీన్‌ వంటి కమ్యూనిస్టు నేతలతో కలిసి రైతాంగ పోరాటాన్ని సాయుధబాట పట్టించారు. నైజాం పాలకులు, రజాకార్లు, నైజాం తాబేదార్లయిన భూస్వాములు, పెత్తందార్లకు వ్యతి రేకంగా కమ్యూనిçస్టు ఉద్యమాన్ని నడిపించారు. 1991 సెప్టెంబర్‌ 7న ఆయన తుదిశ్వాస విడిచారు.

పేదలకు భూమిని పంచిన నేత..
భూమి లేని నిరుపేదలకు తన సొంత భూమి 200 ఎకరాలు దానం చేశారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. ఈ సందర్భంలో ఆయన హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం ప్రభువుల గుండెల్లో దడ పుట్టించారు.

తొలి ఎన్నికల్లో విజయం
రావి నారాయణరెడ్డి 1952లో తొలి పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో పీడీఎఫ్‌ ద్వారా ఎంపీగా పోటీ చేసి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 1957లో భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో మరోసారి నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి పోరాట ఫలితంగానే బీబీనగర్‌–నడికుడి రైల్వేలైన్‌ మంజూ రైంది. తన స్వగ్రామమైన బొల్లేపల్లి పరిధిలో గల నాగిరెడ్డిపల్లి వద్ద రైల్వే స్టేషన్‌కు ఉచితంగా స్థలాన్నిచ్చారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా.. పేదల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారిలో ఒకరిగా బతుకుతూ వారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు. గాంధీ, మావో, క్వశ్చేవ్, హోమిమేన్‌ వంటి ప్రపంచ స్థాయి నేతలను స్వయంగా కలిశారు రావి నారాయణరెడ్డి.

పద్మవిభూషణుడు..
రావి నారాయణరెడ్డిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్‌కు రావి నారాయణరెడ్డి స్టేషన్‌గా నామకరణం చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించిందే కాని ఇప్పటికీ అమలు చేయలేదు. రావి నారాయణరెడ్డి స్థూపాన్ని ఏర్పాటు చేసిన నాగిరెడ్డిపల్లిలో ఘాట్‌గా తీర్చిదిద్దుతామన్న వాగ్దానమూ నెరవేరలేదు. 

తెలంగాణ సాయుధ పోరాటంలో..
రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటా నికి నాయకత్వం వహించి నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఉద్యమాన్ని నడిపారు. ఆయన స్వగ్రామం బొల్లేపల్లి కేంద్రంగా ఉద్యమ కార్యాచరణలు నడిచేవి. మగ్ధూం మొయినొద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రాంచంద్రారెడ్డి దంపతులు తదితరులు ఎందరో రావి నారా యణరెడ్డి స్వగ్రామానికి వచ్చేవారు. తనపై పోలీసుల నిఘా పెరగడంతో మారువేషంలో గ్రామానికి వచ్చి ఉద్యమకారులకు సలహాలు ఇచ్చి వెళ్తుండే వారు. బొల్లేపల్లి మక్తాదార్‌ గులాం రసూల్‌ రజాకార్లతో కలిసి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే నారాయణరెడ్డి సూచనతో 20 మంది దళ సభ్యులు రజాకార్లతో పోరాడి తరిమికొట్టారు. బీబీనగర్‌ మం డలం జంపల్లి, భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామాల్లో పేదలకు వందల ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసిన దానశీలిగా రావి నారాయణరెడ్డిని ఇప్పటికీ ప్రజలు స్మరించుకుంటారు. రావి నారాయణరెడ్డి

మరిన్ని వార్తలు