‘గర్జన’కు సిద్ధం

2 Jun, 2018 08:56 IST|Sakshi
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు కాకాణి, రామిరెడ్డి తదితరులు

నేడు వంచనపై దీక్ష

సింహపురికి తరలివస్తున్న పార్టీ ప్రముఖులు

వీఆర్సీ గ్రౌండ్‌లో ఉదయం  9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష æ

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరుబాట

రాజీనామా చేసిన ఎంపీలు ముఖ్య అతిథులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వంచనపై గర్జన దీక్షకు సర్వం సిద్ధమైంది. నాలుగేళ్లుగా  ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. పోరాటం తీవ్రమైన తరుణంలో రాష్ట్ర ప్రజల బలమైన ఆకాంక్షగా మారింది. ఈ క్రమంలో పోరాటాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరితం ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే నిరహార దీక్షలు, వంటావార్పు, విభిన్న రీతుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూరాజీలేని పోరాటం సాగిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో శనివారం నెల్లూరు వేదికగా వంచనపై గర్జన దీక్ష పేరుతో రాష్ట్రస్థాయి దీక్ష నిర్వహిస్తున్నారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గర్జన దీక్ష జరగనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తరలివచ్చిన నేతలు  ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో నెల్లూరుకు తరలివచ్చారు. వీఆర్సీ గ్రౌండ్‌లో దీక్షా స్థలిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే నగరంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ల క్రితం తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇస్తామని ఎన్నికల సభలో హామీలు ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చాక దాన్ని పక్కన పెట్టేశారు. హోదా కాదు ప్యాకేజ్‌ అంటూ బీజేపీతో నాలుగేళ్లు జతకట్టిన టీడీపీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి చివరకు పదవులకు కూడా రాజీనామా చేశారు. ఈ రాజకీయ పరిణామాల క్రమంలో ఏప్రిల్‌ 30వ తేదీన విశాఖపట్నంలో వంచనపై గర్జన దీక్ష నిర్వహించారు. దీని కొనసాగింపుగా నెల్లూరు నగరంలో శనివారం దీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ, బీజెపీలు కలిపి ప్రజలను వంచించిన వైనాన్ని గర్జన దీక్ష ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ప్రజలను చైతన్యపరచటమే లక్ష్యంగా దీక్ష నిర్వహిస్తున్నారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు
వీఆర్సీ గ్రౌండ్‌లో దీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 250 మంది నేతలు కూర్చొనేందుకు వీలుగా వేదికను సిద్ధం చేశారు. అలాగే ఐదువేల మంది కార్యకర్తలకు సీటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎండతీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇతర జిల్లాల నుంచి తరలివచ్చే వాహనాల కోసం వీఆర్సీ గ్రౌండ్‌తో పాటు లా కళాశాల ప్రాంగణంలో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. పార్టీ రీజినల్‌ కో–ఆర్టినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌ కు మార్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  పార్టీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రె డ్డి, పార్టీ నేతలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు