రెండో స్వాతంత్య్ర సంగ్రామం.. సిద్ధం కండి: స్టాలిన్‌

19 Jan, 2019 17:28 IST|Sakshi

బెంగాల్‌ ర్యాలీలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌

కోల్‌కత్తా:   రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే విపక్షాల ముందున్న ఏకైక లక్ష్యమని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని రెండో స్వాతంత్ర్య సంగ్రామంగా ఆయన వర్ణించారు. బీజేపీ నుంచి దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి విపక్ష పార్టీలకే ఉందని పేర్కొన్నారు.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి స్టాలిన్‌ హాజరై మాట్లాడారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని స్టాలిన్‌ మండిపడ్డారు. విపక్ష పార్టీలో తనకెవ్వరూ శత్రువులు లేరని చెప్పే మోదీ.. పొద్దున లేస్తే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల బతుకులు మారుస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ కార్పొరేట్‌ శక్తులకు ఎర్రతివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మోదీని గద్దెదింపేందుకు పోరాటం చేయాలని స్టాలిన్‌ అన్నారు. అందుకే ఈ పోరాటాన్ని తాను రెండో స్వాతంత్ర్య సంగ్రామంగా వర్ణించినట్లు వివరించారు. 

>
మరిన్ని వార్తలు