రేణుకా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి

19 May, 2018 13:31 IST|Sakshi
మాట్లాడుతున్న రవిచంద్రచౌహాన్‌

ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు  రవిచంద్రచౌహాన్‌

ఖమ్మం, మామిళ్లగూడెం : డాక్టర్‌ రాంజీనాయక్‌ మరణానికి కారకురాలైన మాజీ మంత్రి రేణుకచౌదరిని కాంగ్రేస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేలోతు రవిచంద్రచౌహాన్‌  డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  వైరా, ఇల్లందు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని, ఒక్కొక్క సీటుకు ఐదుగురు పోటీ పడేవిధంగా చేసి, మాయమాటలతో రూ.కోటి పై చిలుకు తీసుకొని సీటు ఇవ్వకుండా మోసంచే చేశారని ఆరోపించారు.

దీంతో మనస్తాపానికి గురైన రాంజీనాయక్‌ చనిపోయారని అన్నారు. అతని భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తీసుకున్న డబ్బు అతని భార్యా పిల్లలకు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ పెద్దలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియా, భట్టి విక్రమార్క, దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి వినతులు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు రాంజీ కుటుంబానికి న్యాయం చేయని పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఇంటింటి ప్రచారం చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు  భీమానాయక్,మైనార్టీ నాయకురాలు నజీమా తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు