కడిగిపారేసిన ఫైర్‌ బ్రాండ్‌!

9 Feb, 2018 18:43 IST|Sakshi
రేణుకా చౌదరి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ... ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఇదే సభలో హామీలిచ్చాం, అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంట’ని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని కడిగిపారేశారు.

కేంద్ర బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, రుణమాఫీకి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే రైతులు గుర్తుకొచ్చారా? రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏం తెలుసని నిలదీశారు. కౌలు రైతులకు పైసా కేటాయించలేదని వెల్లడించారు. పార్లమెంట్‌లో మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చూస్తున్నామని, ఇక మహిళా రైతుల గురించి ఏం మాట్లాడతామని నిర్వేదం వ్యక్తం చేశారు. రేణుకను బీజేపీ నాయకులు ‘శూర్పణక’తో పోల్చిన సంగతి తెలిసిందే.

అర్థం చేసుకోండి: కేకే
ఆంధ్రప్రదేశ్‌ ఆందోళన అర్థం చేసుకోవాలని మోదీ సర్కారును టీఆర్‌ఎస్‌ ఎంపీ కె. కేశవరావు కోరారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు