కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక మార్పు

4 Jul, 2018 17:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పార్టీని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ రాష్ట్రస్థాయి పదవుల్లో పలు మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్‌ నేత దినేశ్‌ గుండురావును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగిన జీ పరమేశ్వర కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పీసీసీ చీఫ్‌గా దినేశ్‌ గుండురావును రాహుల్‌ నియమించారు. మాజీ సీఎం ఆర్‌ గుండురావు తనయుడైన దినేశ్‌ ఐదుసార్లు బెంగళూరులోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. తమకు మంత్రి పదవులు రాకపోవడంతో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నేతలను బుజ్జగించే పార్టీలో అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేసేందుకు రాహుల్‌ ఈ నియామకం చేపట్టారు.

మరిన్ని వార్తలు