కొడంగల్‌ నుంచి రాష్ట్రాన్ని పాలించకూడదా?

15 Nov, 2018 01:29 IST|Sakshi
మద్దూరులో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి 

మద్దూరు (కొడంగల్‌): సిద్దిపేట నుంచి రాష్ట్రాన్ని పాలించొచ్చు కానీ కొడంగల్‌ నుంచి పాలించకూడదా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చింతమడక చిట్టాకు, కొడంగల్‌ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయే తప్ప.. తాండూరు సంతలో పట్టుకొచ్చిన పట్నం సోదరులకు కాదని స్పష్టం చేశారు. బుధవారం కొడంగల్‌ నియోజకవర్గ పరిధి లోని మద్దూరుతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు కేసీఆర్‌ తన ప్రసంగాలతో 1200 మందిని బలి తీసుకున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం నుంచి కాని, అయన సామాజిక వర్గం నుంచి కానీ ఒక్కరైనా అత్మబలిదానం చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు ఐదు సార్లు గుర్నాథ్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన కొడంగల్‌ పౌరుషాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టార న్నారు. తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని,ఆ డబ్బంతా వృథా అయినట్లేనని.. కొడంగల్‌ ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు.

ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కాంగ్రెస్‌లోకి 
డిసెంబర్‌ 7 లోపు టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో బుధవారం ఆయన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.
 

మరిన్ని వార్తలు