పట్నం బ్రదర్స్‌ను బొంద పెడతా: రేవంత్‌

24 Sep, 2018 17:30 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కొడంగల్‌లో గెలిచేది తానేనంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో భారతదేశానికి రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. పట్నం బ్రదర్స్‌(పట్నం మహేందర్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి)ను గుంత తవ్వి బొంద పెడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్ల పాటు వారిద్దరిని రాజకీయ సన్యాసం చేయిస్తానంటూ వ్యాఖ్యానించారు. కొడంగల్‌ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని నినదించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు తనను ఏమీ చేయలేరని, తనపై గెలిచే దమ్ము ఎవరికీ లేదంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చేది మేమే..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అంతమొందించి, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీపీసీసీ పదవి పొందడం ద్వారా ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అవకాశం దక్కిందన్నారు. తన జీవితం ఎప్పుడూ ప్రజా సేవకే అంకితమని రేవంత్‌ వ్యాఖ్యానించారు. కాగా అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డిలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. మహేందర్‌ తాండూర్‌ నుంచి పోటీ చేయనుండగా, నరేందర్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి బరిలో దిగనున్నారు.

మరిన్ని వార్తలు