డిసెంబర్ 7లోపు ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్లో చేరుతారు
సాక్షి, హైదరాబాద్ : ‘ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్లో చేరుతారంటే కొండా విశ్వేశ్వర రెడ్డి, సీతారాం నాయక్ల శీలాన్ని మాత్రమే ఎందుకు శంకిస్తున్నారు? వినోద్ కుమార్, కవితలను ఎందుకు అనుమానించడం లేదు? వెలమలు పార్టీలు మారరు అనుకుంటున్నారా? ఇప్పటికీ చెబుతున్నా..కచ్చితంగా డిసెంబర్ 7లోపు ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్లో చేరుతారు’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన ఎన్నికల అధికారి రజత్కుమార్ను కలిశారు. కొండగల్లోని కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఇటీవల కోడంగల్లో జరిగిన సంఘటనలపై వివరణ ఇచ్చారు.నియోజకవర్గంలోని కాంగ్రెస్కార్యకర్తలను టీఆర్ఎస్కు ఓటు వేయమని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. (దమ్ముంటే ఆ ఇద్దరు ఎంపీలను ఆపు: రేవంత్)
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్లోకి వస్తారంటే కొండా, సీతారాం నాయక్లను శీలాన్ని ఎందుకు శంకిస్తున్నారు.. కవిత, వినోద్లను ఎందుకు అనుమానించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ బంధువులు ఏమో సచ్చిలురు.. మిగతా వాళ్లు నమ్మక ద్రోహులా అని నిలదీశారు. గిరిజన, ఉద్యమకారులను అవమానించారని ఆరోపించారు. బుధవారం తాండూరులోనే ఉన్న కొండా విశ్వేశ్వరరావు మహేందర్ రెడ్డి ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ను సీఎం సీటులో కూర్చోపెట్టడానికి డీజీపీ మహేందర్ రెడ్డి సహాయపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యాధిపతిలా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తనలను ఇబ్బంది పెడితే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలికితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లెక్క అప్పజెప్పుతామన్నారు. కోడంగల్తో తనకు నరేందర్ రెడ్డితో పోటీ కాదని.. కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి మధ్యనే పోటీ జరుగుతుందన్నారు.