‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!

11 May, 2018 03:15 IST|Sakshi
రేవంత్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

స్కాం బయటపడింది ఇదే నెలలో..

తుది చార్జిషీట్‌కు మెరుగులూ ఈ నెలలోనే..

కీలక నిందితుడికీ కలసిరాని మే!

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసుకు, ఆ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డికి మే నెలతో వివాదాస్పద అనుబంధం ఉందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన కుట్ర మొత్తం మే నెలలోనే సాగినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది 2015, మే 30వ తేదీనే. ఈ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ మూడేళ్ల తర్వాత.. అంటే 2018 మే నెలలోనే మళ్లీ తెరపైకి వచ్చింది.

స్టీఫెన్‌సన్‌తో సాగి న సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక ఈ నెలలోనే ఏసీబీకి చేరింది. అటు ఏసీబీ కూడా ఈ నెలలోనే తుది చార్జిషీటు దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తంగా ‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో మే నెల కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన రేవంత్‌రెడ్డికి కూడా మే నెల అచ్చివచ్చి నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయంగా 2015 మే 30న తీరని దెబ్బ పడింది. ఇప్పుడదే నెలలో ఆయన ఏకంగా సీఎం అవడం తన లక్ష్యమం టూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌ పార్టీలో దుమారం లేపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన రాజకీయ భవిష్యత్‌ను ఎటువైపునకు తీసుకెళుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు