రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలి

29 Jun, 2020 04:35 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎంపీలకు కేంద్ర బృందం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ ఒత్తిడి చేశారని, అతితెలివి మానుకుని ఇప్పటికైనా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం చేస్తోన్న అంతంతమాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1% మేరకు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని, రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళనృత్యం చేస్తోందో ఈ శాతాలే నిదర్శనమని పేర్కొన్నారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తోన్న విలువ పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలకు ఇవ్వడం లేదని, ప్రభుత్వాస్పత్రికి వెళ్లడం కంటే శ్మశానానికి వెళ్లడం మేలన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని వివరిం చారు. కరోనా కట్టడిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఆమెను ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తప్పుదోవ పట్టించారు
పారాసిటమల్‌ వేసుకుంటే చాల ని, వేడినీళ్లు తాగితే కరోనా పో తుందని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారని రేవంత్‌ లేఖలో విమర్శించారు. టిమ్స్‌ ఆస్పత్రి విషయంలో హడావిడే తప్ప ఇంతవరకు ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాం డ్‌ చేశారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్‌ విధానాన్ని అనుసరించమని మొత్తుకుంటున్నా ప్రభుత్వం చెవికెక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా నిపుణులతో కమిటీ వేయాలని, అఖిలపక్షాన్ని పిలిచి సలహాలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయలేదనే కారణంతో తన పార్లమెంట్‌ పరిధిలోని లక్ష్మాపూర్‌ గ్రామానికి రైతుబంధు నిలిపివేయడంపై మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌లో విమర్శిస్తూ పోస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు