సాక్షి, హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్ మదుసూదనా చారిని కలిసేందుకు ప్రయత్నించారు. స్పీకర్ సమావేశంలో ఉన్నారని, ఆయనను కలవడం కుదరదని చెప్పడంతో స్పీకర్ పీఏకు రాజీనామాకు ఇచ్చారు.
అనంతరం విలేకరులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యవహార శైలికి నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిపారు. చిలక జోస్యాన్ని నమ్ముకుని కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, ఆయనకు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు. ఆయన జాతకం బాగోలేకపోతే ప్రజల జాతకాలు మార్చటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలంటే కేసీఆర్ ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్న శాసనసభలో తానుండలేనని చెప్పారు. కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల మధ్య ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవిని వదులుకున్నట్టు తెలిపారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఇప్పటికి తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.