ఆలోచించి ఓటు వేయండి

6 Apr, 2019 06:48 IST|Sakshi
మల్కాజిగిరి చౌరస్తాలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి

మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి

మల్కాజిగిరి/నేరేడ్‌మెట్‌/గౌతంనగర్‌: సార్వత్రిక ఎన్నికలు దేశ భవితను నిర్దేశించేవని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు బాగా ఆలోచించి... సరైన అభ్యర్థిని ఎంచుకొని ఓటు వేయాలని ఆయన పిలుపు నిచ్చారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో జరిగిన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్స్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సమస్యలపై మాట్లాడే వారు, అవసరమైతే కొట్లాడే వారుండాలన్నారు.

పేదల కోసం పోట్లాడిన తనపై సీఎం కేసీఆర్‌ 65 కేసులతో 35 రోజులు జైలులో ఉంచారన్నారు. బీజీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంచందర్‌రావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓడిపోయారని, ఇంకా మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉందన్నారు. ఏ నాడూ ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడే తప్ప ప్రజలకు ఎవరికీ తెలియదన్నారు. 2014లో పాల మల్లారెడ్డి పార్లమెంట్‌ మల్లారెడ్డిగా టీడీపీ నుంచి గెలిచారన్నారు. ఏనాడూ లోక్‌సభలో సమస్యలపై మాట్లాడిన దాఖాలాలు లేవన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాట్లాడే, పోట్లాడే సత్తా తనకుందన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలన్నారు. రాహుల్‌ గాంధీ పేదల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రతి పేదకు నెలకు ఆరువేల రూపాయలు నేరుగా జమ అవుతాయన్నారు. అనంతరం గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రధాన మార్గం గుండా ర్యాలీ నిర్వహిస్తూ ఇందిరానెహ్రూనగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జి మండల రాధాకృష్ణయాదవ్, నాయకులు జి.డి.శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి, వేముల వెంకటేష్, లింగారెడ్డి, కరణం గోపి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు