తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్‌

18 Apr, 2019 03:38 IST|Sakshi

రాజస్తాన్‌ అభ్యర్థుల ఆస్తులివే!

రాజస్తాన్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లలో  పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్‌ పేరొందిన షూటర్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్‌లో వివరించారు.

జల్వార్‌–బరన్‌ నుంచి పోటీలో దిగిన  దుష్యంత్‌ సింగ్‌ తనకు ఐదు రోల్స్‌రాయస్‌ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రిజు ఝన్‌ఝన్‌వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్‌లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్‌సమంద్‌ నుంచి పోటీ చేస్తున్న జైపూర్‌ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్న రాం నారాయణ్‌ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట.

మరిన్ని వార్తలు