ప్రజలు విశ్వసించి తీర్పు ఇచ్చారు: ఆర‍్కే

24 May, 2019 17:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించి అఖండ మెజార్టీతో తీర్పు ఇచ్చారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్‌పై విజయం సాధించిన ఆర్కే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లు అండగా ఉండి, సమస్యలను పరిష్కరిస్తామన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్న నమ్మకంతో తమకు అండగా నిలబడి, విజయాన్ని అందించారని అన్నారు.

మంగళగిరి అని స్పష్టంగా పలకలేని అభ్యర్థిని గెలిపిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని నియోజకవర్గ ఓటర్లు ఆలోచించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావలంటే కనీస అవగాహన ఉండాలని ....అలాంటిది లోకేశ్‌కు నియోజవర్గ సరిహద్దులు కూడా తెలియకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్‌ ఏనాడూ మంగళగిరి నియోజకవర్గంలోని ఏ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదని, కనీసం రైతుల సమస్యలను కూడా వినలేదని అన్నారు. పోలింగ్‌ తేదీనే మరిచిపోయిన మాలోకానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఆర్కే వ్యాఖ్యానించారు. దోచుకున్న వేలకోట్ల అవినీతి సొమ్ముతో ఓట్లును కొనాలని చూసిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలిందని అన్నారు. 

మరిన్ని వార్తలు