మురికిగుంట ప్రారంభోత్సవం

25 Mar, 2019 02:50 IST|Sakshi
మురుగునీటితో నిండిన రోడ్డు

స్వచ్ఛ్‌భారత్‌ కోసం ఓ టెకీ వినూత్న నిరసన

న్యూఢిల్లీ: ‘మీరు మాకు ఓటేయండి.. మేము మీకు మలేరియా, డెంగ్యూ లాంటివి ఇస్తాం’ ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ పార్టీల పేరిట వెలిసిన పోస్టర్లు. నడివీధిని మురుగు నీరు ముంచెత్తి, బహిరంగ చెరువును తలపిస్తున్న దృశ్యాన్ని నిరసిస్తూ ఓ రొబోటిక్‌ ఇంజినీర్‌ తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు. ‘ఓపెన్‌ ఎయిర్‌ సీవేజ్‌ లేక్‌’ ప్రారంభోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీ మీనాక్షి లేఖి, ఎమ్మెల్యే శివచరణ్‌లను ఆయన ఆహ్వానించారు. ముందుగా చెప్పుకున్న పోస్టర్లలో వీరిద్దరి ఫొటోలు చేర్చారు.

అసలే ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమమంటే మాటలా? దీంతో దుర్గంధభరిత పరిసరాల్ని శుభ్రం చేసే పని మొదలైంది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ప్రజాపనుల విభాగం ట్రక్కులు ఒక దాని వెనక మరొకటి వచ్చి మురుగు నీటిని తొలగించి అక్కడి డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నికల సమయం కూడా కావడంతో సమస్య త్వరగా పరిష్కారమైందని అంటున్నారు ఆ ఇంజినీర్‌ తరుణ్‌ భల్లా.  ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ‘హింసాత్మక మార్గంపై నాకు ఆసక్తి లేదు. అలాగే, మునిసిపల్‌ అధికారుల చేతికి గ్రీజు అంటించాలని కూడా అనుకోలేదు. ఓ సామాన్యుడిగా ఇతరుల మద్దతు కూడగట్టడమే నా బలం’ అని సమస్య పరిష్కారం సందర్భంగా తరుణ్‌ వ్యాఖ్యానించారు.

శుభ్రంగా మారిన రోడ్డు

మరిన్ని వార్తలు