లోకేశ్‌ అమెరికా వెళ్లింది ఇందుకేనా? : రోజా

10 Dec, 2019 16:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్‌ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్‌ ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని అర్థమవుతోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని నిలదీశారు.



తండ్రికి 25.. కుమారుడికి 70 ఏళ్లు.. : అంబటి
టీడీపీ నేతల కామెంట్లపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఈ రోజు అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఏదో తేడా కనిపిస్తోందని అన్నారు. సభలో చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రాదాయాలు తెలియడం లేదని విమర్శించారు. టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన ఫొటోలను ఆయన సభలో చూపించారు. అసత్యాలను సునాయాసంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు.

మరిన్ని వార్తలు