‘అప్పుడు దండగన్నాడు.. ఇప్పుడేమంటాడో’

25 Sep, 2018 17:38 IST|Sakshi

చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. క్యాబినెట్‌ హోదా కలిగిన ఎమ్మెల్యేకే రక్షణ లేనిచోట ఇక ప్రజలకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేదనీ, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా, అరుకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు ఆదివారం ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో వ్యవసాయంపై మాట్లాడతాననడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు.

ప్రజాభిమానం జగన్‌కు జై అంటోంది..
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగేసి లక్షలాది జనం కదం తొక్కడంతో కృష్ణా బ్యారేజీ గడగడలాడిందనీ, గోదారి తీరం ఉప్పొంగిందనీ, విశాఖ తీరం పోటెత్తిందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా విజయపురం మండలంలో మంగళవారం రోజా పాదయాత్ర చేశారు. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలోని కొత్త వలసలో 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు