విద్యార్థి సంఘాలు రద్దు చేసిన ఘనత బాబుదే

8 Jan, 2020 12:01 IST|Sakshi

మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌

సాక్షి, విశాఖపట్నం: అధి​కారంలో ఉన్నపుడు విద్యార్థులు రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా విద్యార్థులను రోడ్డు ఎక్కిస్తున్నారని విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌ అన్నారు. నాడు విద్యార్థి సంఘాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ప్రస్తుతం ఐక్యకార్యాచరణ సమితి పేరిట పిలిచి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మంగళవారం చినకాకాని వద్ద ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ దాడిలో నిజమైన రైతులు ఎవరూ లేరని.. అమాయక విద్యార్థులపై కేసులు పెట్టవద్దని రెహమాన్‌ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.(ప్రభుత్వ విప్‌ పిన్నెల్లిపై హత్యాయత్నం)

చంద్రబాబు విషం కక్కుతున్నారు..
‘గత ఐదేళ్లలో సమగ్రమైన ప్రణాళికలు రూపొందించి ఉంటే రాజధానికి ఇప్పటికే 60శాతం పనులు అయ్యుండేవి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇచ్చిన 33వేల ఎకరాలతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బీజేపీ నేతలే చెబుతున్నారు. నాడు టీడీపీ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఓ కన్ను కోల్పోయాం. చంద్రబాబు రెండు నాల్కల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. ఆయన చపల చిత్త మనస్కులు అని రెహమాన్‌ చంద్రబాబు తీరును ఎండగట్టారు.

అదే విధంగా... రాజధానిగా విశాఖపట్నానికి ఏమి తక్కువ అని ప్రశ్నించారు. ‘విశాఖ మినీ ఇండియా. రెడీమేడ్ క్యాపిటల్. అన్ని వనరులు ఉన్న మహా నగరం. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే చంద్రబాబు విషం కక్కుతున్నారు. సీనియర్ రాజకీయ నేతగా ఉత్తరాంధ్ర కు అన్యాయం చేయవద్దు’ చంద్రబాబుకు విఙ్ఞప్తి చేశారు. కాగా టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, వుడా చైర్మన్‌గా పనిచేసిన ఎస్‌ఏ రెహమాన్‌ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

చదవండి: విశాఖలో టీడీపీకి షాక్‌!

మరిన్ని వార్తలు