బీజేపీ కనుసన్నల్లో కేసీఆర్‌ ‘ఫ్రంట్‌’

20 May, 2018 11:59 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ హోంమంత్రి సబితారెడ్డి

రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ పెరుగుతుందని కుట్ర 

కేసీఆర్‌ పాలనలో జిల్లాకు పూర్తి అన్యాయం 

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం 

కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సబితారెడ్డి

మొయినాబాద్‌(చేవెళ్ల) : సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. దేశంలో మోదీ గ్రాఫ్‌ పడిపోతుందని, కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగంగానే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారన్నారు. శనివారం మొయినాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి జెండా ఆవిష్కరించారు.

అనంతరం అంజనాదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని.. రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు అదే గతి పడుతుందన్నారు.

దేశంలో రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ పెరుగుతుందని, దీన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే బీజేపీ కేసీఆర్‌ను పావుగా వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లీటరు పెట్రోలు రూ.50 ఉంటే ఇప్పుడు రూ.80 దాటిందన్నారు. పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికీ ఏటీఎంల్లో డబ్బులు లేని పరిస్థితి దాపురించిందని, కానీ కేసీఆర్‌ ఇచ్చే పెట్టుబడి చెక్కులు డ్రా చేసుకునేందుకు మాత్రం బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో ఉంచుతున్నారని విమర్శించారు.

 వైఎస్సార్‌ ప్రాజెక్టును అడ్డుకున్నారు..

 ప్రత్యేక రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు పూర్తి అన్యా యం జరుగుతోందని సబితారెడ్డి అన్నారు. జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకుని నీళ్లు రాకుండా చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీళ్లు తెస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసెత్తడంలేదన్నారు.

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

కేంద్రం, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మద్దతు ధర పెంచి రైతులకు ఎకరాకు రూ.18 వేల లాభం వచ్చేలా చేస్తామన్నారు.

కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షాబాద్‌ దర్శన్, బీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ రామకృష్ణగౌడ్, మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు మాణిక్‌రెడ్డి, గణేష్‌ గౌడ్, యాదయ్య, మాధవరెడ్డి, సర్పంచ్‌ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్త లావణ్య, నాయకులు మాణెయ్య, శ్రీనివాస్‌యాదవ్, సతీష్, వడ్డెరాజు, మహేందర్, కృష్ణగౌడ్, అశోక్‌రెడ్డి, జొన్నాడ రాజు, మక్బుల్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఏఐసీసీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్‌ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యావత్‌ భారతదేశం ఎదిరిచూసిన కర్ణాటక ఫలితాలు సంతోషానిచ్చాయన్నారు.

రాజ్యాంగ వ్యవస్థను కాపాడాల్సిన గవర్నర్‌ కర్ణాటకలో ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా నిర్ణ యం తీసుకున్నారని.. దానికి సుప్రీంకోర్టు సరై న నిర్ణయం తీసుకుని ప్రజాస్వామాన్ని కాపాడిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జోన్ల విభజనతో వికారాబాద్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సబితారెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలన్నారు.

మరిన్ని వార్తలు