'అమరావతి పేరుతో భ్రమ సృష్టించారు'

19 Feb, 2020 16:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : 'రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం' అనే అంశంపై వైసీపీ చేనేత విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్పార్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాలు నుంచి చేనేత వర్గం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'రైతు అన్నం పెడితే.. నాగరికత నేర్పిన వారు చేనేతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేతల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. నాడు దివంగత సీఎం వైఎస్ ఆర్ విద్య, వైద్యం పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  ప్రస్తుతం మగ్గం కార్మికుల కుటుంబానికి రూ. 24 వేలు అందించి సీఎం జగన్‌ వారికి అండగా నిలిచారు. అర్హతలు సడలించి ఆరోగ్యశ్రీ పథకం కింద 2 వేలుపైగా రోగాలకు ఉచితంగా చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ వెనుకబడిన వర్గాలకు మేలు చేకూరుస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి, అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. గత ప్రభుత్వం రూ. 3 లక్షలు 60 వేల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆర్ధిక పరిస్థితి గాడిన పెట్టె దిశగా అడుగులు వేస్తున్నాం. 

రాష్ట్రంలో మీడియా కంటే..సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో కలిసి చంద్రబాబు అమరావతిని దోచుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పేరుతో ఒక భ్రమ సృష్టించారు. ఆయన కుమారుడు లోకేష్ ను గత ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు దారుణంగా ఓడించారు. రాజధాని పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు.. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. మూడు ప్రాంతాలు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ నడుం బిగించారు. విశాఖపట్నం అంటే.. ఐఏఎస్ అధికారులు అంతా సమ్మతంగా ఉన్నారు. చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని' పేర్కొన్నారు. (రహస్యాలు లేవు.. ప్రజలకు అన్నీ తెలుసు: సజ్జల)

కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. చేనేతలు అంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఎక్కువని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులు 13 లక్షలు 50 వేల మంది ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి చేనేతకు 3శాతం అంటే  428 కోట్లు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలకు కేంద్రం కేటాయించదని గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్‌ ఒక నేతన్న నేస్తం కింద రూ. 180 కోట్లు కేటాయించి చేనేతలు పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారని అభిప్రాయపడ్డారు. 

వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చేనేతలకు 25  మోసపూరిత హామీలు ఇచ్చి  టీడీపీ మోసం చేసిందని, అలాగే రూ. వెయ్యికోట్ల రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్పి మాట తప్పారని వెల్లడించారు.  చేనేత సహకార సొసైటీలను మరింత బలోపేతం చేయాలని, మగ్గం నేసే ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24వేలు అందచేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు.(విద్యుత్‌ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

బుట్టా రేణుక మాట్లాడుతూ.. వికేంద్రీకరణ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయం ప్రస్తావించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేనేత హస్తం కింద 360 డిగ్రీల కోణంలో మ్యానిఫెస్టో రూపకల్పన చేసి నవరత్నాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజధాని ప్రాంత ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు