ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

18 Jun, 2019 19:45 IST|Sakshi

కేబినెట్‌ హోదాతో నియామకం 

ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, పార్టీ  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)గా నియమితులయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కేబినెట్‌ ర్యాంకులో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్‌) శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మంగళవారం జీవో జారీ చేశారు.

పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి..
సౌమ్యుడిగా, మృధుస్వబావిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీలో కీలక భూమిక నిర్వహిస్తున్నారు. ఆవిర్భావంనుంచి ముఖ్య నేతల్లో ఒకరిగా పలు బాధ్యతలు చేపట్టారు. గత పదేళ్లుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సీనియర్‌నేతగా, అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వివిధ రూపాల్లో విశేష సేవలు అందించారు. ప్రముఖ పాత్రికేయునిగా, సీనియర్‌ రాజకీయ నేతగా ప్రజా వ్యవహరాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. అందుకే ఆయన్ను కేబినెట్‌ హోదాతో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా నియమించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

జర్నలిస్టుగా ప్రస్థానం
సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియాకు ఫౌండర్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. పత్రిక, టీవీ రంగాల్లో తనదైన ముద్రవేవారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణానంతరం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేసిన తరువాత పార్టీ అవసరాల కోసం ఆయనను  వైఎస్‌ జగన్‌ రాజకీయ సలహాదారుగా నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి 1978లో ఈనాడులో పాత్రికేయ జీవితం ఆరంభించి ఆంధ్రభూమి, ఉదయం పత్రికల్లో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. తర్వాత అడ్వర్టయిజ్‌మెంట్‌తో పాటు వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు