బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం

9 Mar, 2020 04:15 IST|Sakshi

చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల 

కడప కార్పొరేషన్‌: రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు చెప్పినా బీసీలకు వైఎస్సార్‌సీపీ తరఫున 34 శాతం టికెట్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా ఇవ్వాలని సవాల్‌ విసిరారు. ఆదివారం కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
- సీఎం వైఎస్‌ జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన 9 నెలల్లో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అద్భుత పాలన అందించారు.
- విద్య, వైద్య, ఆరోగ్య పరంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకుపోతూ మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లోనూ, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశారు.
- స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నా కోర్టు 50 శాతానికి కుదించింది. దీనివల్ల బీసీలు కోల్పోయే పది శాతం రిజర్వేషన్లను పార్టీ ద్వారానే ఇచ్చి గెలిపించుకుంటాం.
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే ఓర్వలేక కోర్టుకు పోయి స్టే తెచ్చిన టీడీపీ.. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది.
- ఎన్నికల్లో పోటీ విషయమై చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ కథ ఖతమ్‌ అయినట్లేననిపిస్తోంది.
- మార్చి 31లోపు ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన 
రూ. 5 వేల కోట్ల నిధులు రాకుండా పోతాయని తెలిసి టీడీపీ కుట్ర చేసింది. అందుకే నెలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
- ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డా.వెంకట సుబ్బయ్య, డా.సుధీర్‌రెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి తదితరులు పాల్గొన్నారు.
- స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం సజ్జల ట్వీట్‌ చేస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకున్నా బీసీల అభివృద్ధి ఆగదని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల అభివృద్ధి విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో 10 శాతం అధిక రిజర్వేషన్లు బీసీలకు కల్పించి చిత్తశుద్ధిని చాటారని తెలిపారు. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలు లేకుండా సీఎం జగన్‌ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే.. చంద్రబాబు మాత్రం తమను ఓడించడానికే ఇలా చేస్తున్నారంటూ వింత వాదన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా బలం కోల్పోయిన వారి ప్రవర్తన ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు